సెల్‌ఫోన్‌ పోయిందా.. పట్టేయొచ్చు

పోగొట్టుకున్న, అపహరణకు గురైన సెల్‌ఫోన్‌ ఎక్కడుందో కనిపెట్టేందుకు, పనిచేయకుండా చూసేందుకు ప్రత్యేక పోర్టల్‌ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. గత సెప్టెంబరులో ముంబయిలో ఈ సేవ ఆరంభం కాగా, ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ ప్రాంతానికి విస్తరించారు. 2020లో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. దిల్లీలోని మొబైల్‌ చందాదారులు www.ceir.gov.in (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ను ఇందుకోసం ఆశ్రయించాలి. ప్రతి సెల్‌ఫోన్‌కు ఉండే ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ) సంఖ్యను, ఫోన్‌ పోయిందని పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు వివరాలు, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే, అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల పరిధిలో ఆ ఫోన్‌ పనిచేయకుండా నిరోధిస్తారు. సెల్‌ఫోన్‌లో వేరే సిమ్‌కార్డు వేసి, ఎక్కడ వాడినా తెలిసిపోతుంది. పోలీసులు వెంటనే ఆచూకీ కనిపెట్టడం వీలవుతుందని టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.


ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకత ఇదీ

ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెల ఐఎంఐఈ నెంబరు ప్రత్యేకంగా ఉంటుందని, అయితే కొందరు నేరస్తులు ఈ సంఖ్యను కూడా క్లోన్‌చేసి, చోరీచేసిన ఫోన్లకు వాడుతున్నారన్నారని టెలికాం కార్యదర్శి అన్షు ప్రసాద్‌ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఒక ఐఎంఈఐ సంఖ్యను నిరోధిస్తే, పలు ఫోన్లు పనిచేయకుండా పోవచ్చని, ఈ సమస్య రాకుండా, చోరీకి గురైన ఫోన్‌ మాత్రమే పనిచేయకుండా చేయడం ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతగా వివరించారు. ఈ ఫిర్యాదులన్నింటికీ కేంద్రియ రిజిస్టర్‌ ఉంటుంది కనుక, అన్ని నెట్‌వర్క్‌ సంస్థలూ కనిపెడతాయని స్పష్టం చేశారు. ఇందువల్ల ఫోన్లు చోరీచేసినా, విక్రయించడం ఆగుతుందని పేర్కొన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top