తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే

పూర్తి పేరు : సావిత్రిబాయి ఫూలే
పుట్టిన తేది : 1831 జనవరి 3
జన్మస్థలం : నయిగావ్ గ్రామం, సతారా
భర్త : మహాత్మా జ్యోతిరావు ఫూలే
వృత్తి : ఉపాధ్యాయిని, సంఘ సంస్కర్త
1831 జనవరి 3వ తేదిన ఖండోజి, లక్ష్మి దంపతులకు మహారాష్ర్టలో కవాడి గ్రామంలో జన్మించిన సావిత్రీబాయికి, బాల్యంలోనే జ్యోతిరావు ఫూలేతో 1840లో ఎనిమిద యేట వివాహం జరిగింది. ఫూలే తన జీవిత భాగస్వామికి విద్యావసరతను గుర్తించాడు. ఆమె ఆసక్తి దోహదపడింది. పరమహంస సభ సభ్యుడు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ్ శివరాం భావాల్కర్ సహాయంతో ఆమెను విద్యావంతురాలిగా చేశాడు.సుగుణబాయి సహకారంతో సావిత్రిబాయి 1847లో మహర్వాడ (ఎస్సి)లో బాలికా పాఠశాలను ప్రారంభించారు. ‘మనువు పెట్టిన ఆంక్షలన్ని నిజం కాదు. వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు. రండి. చదువుకోండి. చేయూతనిస్తాం. చదువు మీకు ఆనందాన్నీ, విజ్ఞానాన్ని ఇస్తుంది. సందేహించకండి...’ అంటూ వాడల్లో తిరిగి ప్రచారం చేస్తూ నచ్చ చెప్పి బాలికలను పాఠశాలకు తోడుకొని వచ్చేవారు సావిత్రిబాయి. 1848 నాటికి మరో పాఠశాల ప్రారంభించారు.
ఈ పాఠశాలలను నడిపించే బాధ్యత సావిత్రి స్వీకరించారు. సావిత్రీబాయి పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో బ్రాహ్మణ వర్గాలు పేడ, రాళ్లు, గుడ్లతో కొట్టి అవమానించేవారు. అయినా ఆమె ఏనాడూ చలించలేదు. ఇలా పూణే చుట్టుప్రక్కల అంటరాని బాలికల విద్య కోసం దాదాపు 18 పాఠశాలలు స్థాపించి, నిజమైన విద్యాదేవతలుగా నిలిచారు ఫూలే దంపతులు.కేవలం బాలికలకు విద్యనందించే కార్యక్రమమే కాక వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల సమస్య, సతీసహగమనాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు సావిత్రిబాయి. కాశిబాయి అనే వితంతువు గర్భం దాల్చడంతో, ఆమె ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఫూలే దంపతుల కంటబడింది. ఆమెను రక్షించి ఆమెకు జన్మించిన యశ్వంతరావును దత్తత తీసుకొని పెంచిన మాతృదేవతామూర్తి సావిత్రీబాయి. వితంతువులకు బోడిగుండు కొట్టించి, చీకటి గదులకు పరిమితం చేసే అమానవీయ విచారకర విషయాలను తీవ్రంగా ఖండించారు. ‘బాలహత్య ప్రతిబంధక్ గృహ’ స్థాపించి బాల హత్యలను నివారించేందుకు కృషి చేసిన ప్రేమ స్వరూపిణి సావిత్రీబాయి ఫూలే. తను చేపట్టిన కార్యాన్ని అకుంఠితదీక్షతో విజయవంతం చేసిన సమర్థురాలామె.కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన యోధురాలు. ఆరోజుల్లో ఇంతటి సాహసం చేసి సామాజిక రుగ్మతల నిర్మూలనకు నడుంకట్టి ఒక ‘శూద్ర స్త్రీ’ ఉదాత్త, విశాల దృక్పథంతో ఉద్యమాన్ని నడిపించారంటే కొంత ఆశ్చర్యం కలిగించక మానదు.1873లో సత్యశోధక్ సమాజ్ (సత్యాన్ని శోధించే సంస్థ) ఏర్పడినప్పటినుండి జ్యోతిబా ఫూలే వెన్నంటి ఉండి, ఫూలే అనంతరం సత్యశోధక్ (సంఘంలో బ్రాహ్మణవర్గాల అనవసర జ్యోక్యాన్ని తిరస్కరించే) ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఆమెకే దక్కుతుంది. బ్రాహ్మణులు లేకుండా పెళ్లిళ్లు చేయడం, వృత్తికులాల పూజలుమనుధర్మశాసనోల్లం ఘన అంటే, మంగళ్ళు క్షవరం చేయకపోవడం, చాకళ్లు బట్టలు ఉతకకుండా తిరస్కరించడం వంటి పోరాటాలు నడిపించే ఫూలేకు కుడిభుజమైంది.
ఒక రోజు ఒక అడుక్కునేవాడు సావిత్రీబాయి ఫూలే ఇంటికి రాగా ఆమె అతనికి కొంత ధాన్యాన్ని బహూకరించింది. దారిలో వెళుతుండగా అతని ధాన్యపు మూట చినిగి ఆ ధాన్యం భూమి పాలైంది. అదే దారి గూండా వస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే తన రుమాలును అతనికి ఇచ్చి ఆ ధాన్యాన్ని మూటగట్టాడు. తరువాత ఆ దానం చేసిన ఇల్లాలు తన భార్య సావిత్రి భాయి అని తెలిసి మిక్కిలి సంతోష పడ్డాడు ఫూలే. ఈ దాంపత్య జీవితం నిజంగా ఆదర్శప్రాయం.ఇదే క్రమంలో అపారజ్ఞానాన్ని సంపాదించారు సావిత్రి. 1854లో ‘కావ్య ఫూలే’ అనే పద్య కావ్యాన్ని రచించి చరిత్ర సృష్టించారు. మహారాష్ర్ట ‘ఆధునిక కవిత్వానికి ఆద్యురాలు’గా ఆమె గుర్తింపు పొందారు. 1856లో సావిత్రీ భాషణ్ (సావిత్రీ ఉపన్యాసాలు) పేరుతో మరో గ్రంథాన్ని రాశారు. ‘బవన్ని కాశి’, ‘సావిత్రి లేఖలు’, ‘సుబోధ్ రత్నాకర్’ వంటి విప్లవాత్మక కావ్యాలు ఆమె అపార ప్రతిభకు అద్దం పట్టే రచనలు.
ఇలా ఆజన్మాంతం పేద, స్త్రీ, అంటరాని వారి అభ్యున్నతే ధ్యేయంగా, సామాజిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా సమాజాన్ని 100 సంవత్సరాలు ముందుకు పరుగులు పెట్టించిన ఆధునిక సంఘసంస్కర్త సావిత్రిబాయి, 1896-97లో మహారాష్ర్టంలో సంభవించిన ప్లేగు వ్యాధికి గురైన వారికి సేవ చేయడంలో నిమగ్నమై చివరికి అదే వ్యాధికి గురై అసువులు కోల్పోయారు సావిత్రీబాయి ఫూలే. ఇలా తరతరాల అంధకారానికి చరమగీతం పాడి, మనువాద పెత్తందారీ పోకడలను చిత్తుచేసి నూతన సామాజిక విప్లవానికి పాదులు వేసిన ఫూలే దంపతులు ‘వ్యధాకులితమైన సంఘర్షణ సృజించిన’ మహోతన్న ఆదర్శమూర్తులు నేటికీ ఆచరణీయులు, అనుసరణీయులు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top