PRC News: పీఆర్సీపై సీఎం సమీక్ష.3, 4 రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చు: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి..



పీఆర్సీపై సీఎం సమీక్ష..

ఎంత భారం పడుతుందన్న  దానిపై అధికారుల నివేదిక..

3, 4 రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చు: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అమలు, ఫిట్‌మెంట్‌, తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ఉన్నతాధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు రావత్‌, శశిభూషణ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతి పర్యటనలో వారం, పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని చెప్పిన సీఎం గురువారం అదే అంశంపై సమీక్ష నిర్వహించారు.

అయితే ఈ సమావేశంలో నిర్ణయాలేవీ బయటకు వెల్లడి కాలేదు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, ఏ సమీకరణాల్లో వెళితే ఎంత భరించాల్సి వస్తుందనే అంశాలపై ఆర్థికశాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి, ముఖ్యమంత్రివద్ద ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతిగా 27 శాతం ఇస్తోంది. మరోవైపు పీఆర్సీ నివేదిక బయటపెట్టి, ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ నివేదిక..

మరోవైపు పీఆర్సీపై 3, 4 రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులు బుధవారం కసరత్తు చేసి, ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. దీనిపై సీఎం జగన్‌ గురువారం ఉన్నతాధికారులతో చర్చించారు. పీఆర్సీ ప్రకటనకు ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది’ అని వెల్లడించారు. పీఆర్సీ కోసం ఇన్నాళ్లు ఆగినవారు మరో 10 రోజులు ఆగలేకపోతున్నారా? అని ఆందోళనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘వారి మాజీ అధ్యక్షుడికి పదవి వచ్చే వరకు ఖాళీగా ఉన్నారు. పదవి వచ్చాక ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ‘మార్కెటింగ్‌ శాఖలో ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలివ్వాలని కోరుతున్నారు. మార్కెట్‌ కమిటీల్లో పని చేసే ఉద్యోగులు, పింఛనుదార్లకు 010 కింద వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు’ అని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top