పండగల వేళల్లో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టండి... రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచన

 దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.కొత్త వేరియంట్‌ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలు..

* పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.

* పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలి.

* బాధితుల నమూనాలకు ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.

* అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలి.

* ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.

* రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.

* వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలి. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.

* రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top