ప్రామిసరీ నోటు-పరిచయం

ప్రామిసరీ నోటు-పరిచయం

1) ఏ వ్యక్తి అయినా ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు తాను తిరిగి చెల్లించడానికి గాను రాసే వాగ్ధాన పత్రాన్నే ప్రామిసరీ నోటు అంటారు. ప్రామిస్ అంటే వాగ్ధానం అని అర్ధం. ప్రామిసరీ నోటులో..  డబ్బు తీసుకున్న వ్యక్తి ఎటువంటి షరతులు పెట్టకుండా డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి అడిగిన వెంటనే తిరిగి చెల్లించడానికి సిద్ధంగా వున్నట్లుగా ఉంటుంది. మొత్తంగా అప్పు తీసుకున్న వ్యక్తి ఎటువంటి షరతులు లేకుండా డబ్బు చెల్లించడానికి బాధ్యత వహించాలి. 

*2)* 18 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా ప్రామిసరీ నోటు రాయొచ్చు. మైనర్  ప్రామిసరీ నోటు రాయకూడదు. ఎవరైనా మైనర్ చేత ప్రామిసరీ నోటు రాయించుకున్నా అది చెల్లుబాటు కాదు. మానసిక అస్వస్థతతో ఉన్న వారి చేత కూడా ప్రామిసరీ నోటు రాయించకూడదు.

*3)* ప్రామిసరీ నోటుని తెల్ల పేపర్ మీద లేక బాండ్ పేపర్ మీద (నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్) లేక ఏదయినా ముద్రించిన పేపర్ మీద నైనా రాసుకోవచ్చు. నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ (10/-, 50/-, 100/- విలువైన స్టాంప్ పేపర్) అనేది రిజిస్ట్రార్ ఆఫీసులో లభిస్తుంది. ముద్రించిన ప్రామిసరీ నోటు ఏ షాపులో అయినా లభిస్తుంది.

*4)* ప్రామిసరీ నోటు ఏ భాషలో అయినా రాసుకోవచ్చు. ప్రామిసరీ నోటును రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. 

*5)* ప్రామిసరీ నోటు రాయాలంటే అప్పు ఇచ్చే వ్యక్తి, అప్పు తీసుకునే వ్యక్తి, ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా వుండాలి. ప్రామిసరీ నోటు అనేది ప్రధానంగా డబ్బు అప్పు ఇచ్చే సందర్బాలకే వర్తిస్తుంది.

*6)* అప్పు తీసుకునే వ్యక్తి సాక్షుల సమక్షంలో ప్రామిసరీ నోటుని రాయాలి. ఒకవేళ అప్పు తీసుకునే వ్యక్తికి రాయటం రాకపోతే ఇద్దరు సాక్షుల్లో ఎవరి చేతనైనా ప్రామిసరీ నోటు రాయించొచ్చు. కొన్ని సందర్భాల్లో సాక్షులకు కూడా రాయటం చేతకాక పోతే ఏ ఇతర వ్యక్తి చేత నయినా ప్రామిసరీ నోటు రాయించి దస్తూరి సంతకం చేయించాలి. వీలైనంత వరకు డబ్బులు తీసుకున్న వ్యక్తి చేత ప్రామిసరీ నోటు రాయించటం మంచిది.

*7)* ప్రామిసరీ నోటులో తేదీ, స్థలం, ఎంత డబ్బును అప్పుగా తీసుకుంటున్నారు, ఎవరు అప్పు తీసుకుంటున్నారు, ఎవరు అప్పు ఇస్తున్నారు, అప్పు ఎంత, ఏ అవసరాల కొరకు అప్పు తీసుకుంటున్నారు, ఎంత వడ్డీకి అప్పు తీసుకుంటున్నారో తెలిపే వివరాలు  రాయాల్సి ఉంటుంది.

*8)* N I (నెగోషియబుల్ ఇంస్ట్రుమెంట్) ACT సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి షరతులు లేకుండా ద్రవ్య పూర్వక (డబ్బు) లావాదేవీలు జరగడాన్ని అనుమతిస్తుంది. అంటే  ప్రామిసరీ నోటు ద్వారా అప్పు ఇవ్వొచ్చు లేదా అప్పు తీసుకోవచ్చు అని అర్థం.

*9)* ప్రామిసరీ నోటు రాసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రామిసరీ నోటు కింది భాగంలో రూపాయి రెవిన్యూ స్టాంప్ మీద సంతకం చేయాలి. ప్రామిసరీ నోటు రాసిన వ్యక్తి తన సంతకంతో పాటు తేదీ కూడా వేస్తే మంచిది. ఎందుకంటే నోటు రాయించుకున్న వ్యక్తి ఆ నోటును దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసినట్లవుతుంది. ఒక వేళ షూరిటీ (జామీనుదారు) కూడా అందుబాటులో ఉంటే అతని చేత కూడా అదే నోటు కింది భాగంలో రూపాయి రెవిన్యూ స్టాంపు పైన సంతకం చేయించుకుంటే మంచిది. కొన్ని సందర్భాల్లో షూరిటీ ఇచ్చిన వ్యక్తి నుండి వేరే ప్రామిసరీ నోటు మీద సంతకం కూడా చేయించుకోవచ్చు.

*10)* ప్రామిసరీ నోటులో ఒక రసీదు ఉంటుంది. నోటు రాయించేటప్పుడు రసీదు మీద కూడా అప్పు తీసుకున్న వ్యక్తి నుండి సంతకం తీసుకోవాలి. రసీదు మీద సంతకం చేయించేటప్పుడు ఒక రూపాయి రెవిన్యూ స్టాంప్ మీద సంతకం చేయించాలి. అలా రసీదు మీద సంతకం తీసుకొన్నట్లయితే అప్పు తీసుకున్న వ్యక్తికి డబ్బు ముట్టిందని అర్ధం.

*11)* అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకపోతే అతనికి న్యాయవాది ద్వారా నోటీసు ఇవ్వొచ్చు. అయితే నోటీసు ఇవ్వటం తప్పనిసరి కాదు. కానీ నోటీసును ఇవ్వటం వలన త్వరగా డబ్బులు తిరిగి పొందే అవకాశం వుంది.

*12)* అప్పు తీసున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వెంటనే సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు.
● ప్రామిసరీ నోటు మీద రాసిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా కోర్టులో కేసు వేయవచ్చు.
● నోటు రాసిన తేదీ నుండి 3 సంవత్సరాల తర్వాత ఆ నోటు చెల్లుబాటు అవ్వదు. ఒక వేళ అప్పు తీసుకున్న వ్యక్తి అసలులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి నట్లయితే.. చెల్లించిన తేదీ నుండి మరల 3 సంవత్సరాల వరకు ఆ నోటు చెల్లుబాటు అవుతుంది.
● అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీ మాత్రమే తిరిగి చెల్లించి నట్లయితే అక్కడి నుండి 3 సంవత్సరాలనే లిమిటేషన్ వర్తించదు. అసలును తిరిగి చెల్లిస్తేనే లిమిటేషన్ పీరియడ్ వర్తిస్తుంది.
● అప్పు తీసుకున్న వ్యక్తి అసలులో కొంత భాగాన్ని తిరిగి చెల్లించినట్లయితే ప్రామిసరీ నోటు వెనుక భాగంలో ఇద్దరు సాక్షుల సమక్షంలో అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం  చేయాలి.
● ప్రామిసరీ నోటు అనేది సివిల్ కేసుగా పరిగణిస్తారు. కేసు కోర్టులో వేసేటప్పుడు కోర్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

*13)* కోర్టులో ప్రామిసరీ నోటుని ఉపయోగించి కేసు వేసిన తర్వాత కోర్ట్ వారు విచారించి డిక్రీ (ఆదేశం) ఇస్తారు. కోర్ట్ వారు ఇచ్చిన డిక్రీని (ఆదేశాన్ని) ఆ డిక్రీ పొందిన వ్యక్తి 12 సంవత్సరాలలోపు ఎప్పుడైనా కోర్ట్ ద్వారా అమలుచేయించుకోవచ్చు.

*14)* కోర్ట్ డిక్రీ (ఆదేశం) ఇచ్చిన తర్వాత కూడా అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బుల్ని తిరిగి కట్టకపోతే  కోర్ట్ ద్వారా అతని ఆస్తులని జప్తు చేసి.. తద్వారా డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చు. అప్పు తీసుకున్న వ్యక్తి పేరిట ఎటువంటి ఆస్తులు లేనట్లయితే ఆ అప్పుని తిరిగి రాబట్టుకోలేము. ఒక వేళ అప్పు తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే అతని జీతం నుండి కూడా డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చు

*15)* అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే అతని వారసుల మీద కేసు వేసి డబ్బులు రాబట్టుకోవచ్చు. ఒక వేళ అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి వారసులకు అప్పు తీసుకున్న వ్యక్తి నుండి డబ్బులు తిరిగి పొందే చట్టబద్ధమైన హక్కు ఉంది.

*16)* *ప్రామిసరీ నోటు రాయించుకునే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
A) ప్రామిసరీ నోటు మీద రూపాయికి తక్కువ కాని రెవిన్యూ స్టాంప్ మాత్రమే వాడాలి. పోస్టల్ స్టాంప్ వాడకూడదు.
B) వీలైనంతవరకు అప్పు తీసుకున్న వ్యక్తి, సాక్షులు, దస్తూరి ఒకే సందర్భంలో సంతకాలు జరిగేలా చూసుకోవాలి.
C) తరచుగా ఇతరులకు అప్పు ఇచ్చేవారు మనీ లెన్డర్స్ చట్టం ప్రకారం లైసెన్స్ తీసుకొని అప్పు ఇవ్వటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో అప్పు తీసుకున్నవారు తరచుగా అప్పులు ఇవ్వటం ద్వారా మనీ లెండర్స్ చట్టాన్ని మీరు అనుసరించలేదని ఎదురు తిరిగే అవకాశం ఉంది.
D) 20,000/- రూపాయల కంటే ఎక్కువ మొత్తం అప్పు ఇచ్చేప్పుడు తప్పని సరిగా ఆన్ లైన్ ద్వారా లేదా చెక్ ద్వారా ఇవ్వటం మంచిది. ఎందుకంటే భవిష్యుత్తులో అప్పు తీసుకున్న వ్యక్తి నేను డబ్బులు తీసుకోలేదని వాదన చేసినా కూడా మనము నిరూపించుకోవచ్చు.
E) వీలైనంత వరకు అప్పు తీసుకున్న వ్యక్తి చేతనే ప్రామిసరీ నోటు రాయిస్తే మంచిది. నోటు అతని చేత రాయించటం వలన అతను అప్పు తీసుకున్నట్లుగా నిరూపించవచ్చు.
F)ప్రామిసరీ నోటులో పేర్కొన్న తేదీ, స్థలం, సంతకంలో కొట్టి వేతలు లేకుండా చూసుకోవాలి.ఒక వేళ కొట్టి వేతలు ఉంటే మరొక ప్రామిసరీ నోటును రాయించుకోవాలి.
G) ప్రామిసరీ నోటు ఎంత డబ్బు లావాదేవీల కైనా రాసుకోవచ్చు. కానీ కోర్ట్ అంత డబ్బు నీకు ఎలా వచ్చిందని అప్పు ఇచ్చిన వ్యక్తిని అడిగే అవకాశం ఉంది. నిరూపించుకోవాల్సిన బాధ్యత అప్పు ఇచ్చిన వ్యక్తి మీద ఉంటుంది.
H) ప్రామిసరీ నోటును ఒకే పెన్నుతో రాస్తే మంచిది. రెండు, మూడు పెన్నులు ఉపయోగించకూడదు. ఒకే హాండ్ రైటింగ్ ఉపయోగించాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లకుండా పోతుంది.
I) అప్పు ఇచ్చిన వ్యక్తి  ప్రామిసరీ నోటులో దస్తూరి రాయకూడదు.
J) అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్, డ్రైవింగ్ కార్డ్ నకలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే కోర్టులో కేసు వేయాల్సి వస్తే అతని అడ్రస్ అవసరం ఉంటుంది.           

17)అప్పు తీసుకొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
A) ఖాళీ ప్రామిసరీ  నోటుపై ఎట్టి పరిస్థితుల్లో సంతకం చేయకూడదు. ప్రామిసరీ నోటు పూర్తిగా నింపిన తర్వాతే ప్రామిసరీ నోటు కింది భాగంలో సంతకం చేసి  తేదీ కూడా వేస్తే మంచిది.
B) ఒక వేళ ప్రామిసరీ నోటుతో పాటు చెక్కును షూరిటీగా ఇవ్వాల్సి వస్తే.. ప్రామిసరీ నోటు వెనకాల చెక్ నెంబర్ రాసి ఆ చేక్కుని షూరిటీగా ఇస్తున్నట్లు తెలిపి సంతకం చేయాలి. ఇలా జాగ్రత్త తీసుకోవటం వలన అప్పు ఇచ్చిన వ్యక్తి చెక్ ని క్రిమినల్ కోర్టులో వేయటానికి అవకాశం ఉండదు.
C) నూటికి రు.2/- వడ్డీ మాత్రమే ప్రామిసరీ నోటులో రాయాలి. అధిక వడ్డీలు చెల్లుబాటు అవ్వదు.
D) ప్రామిసరీ నోటులో మీ సంతకం తీసుకొని, ఒక వేళ మీ సమక్షంలో నోటు పూర్తి చేయకుండా ఇతరులు ఎవరైనా ఆ నోటును దుర్వినియోగం చేస్తారని భావిస్తే సివిల్ కోర్టుని ఆశ్రయించి ఆ నోటు చెల్లుబాటు కాకుండా ఆర్డర్ పొందొచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top